తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల.... 92 లక్షల మందికి నోటీసులు, మీ పేరు ఉందా చెక్ చేసుకోండి!..
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది..
CHECK YOUR VOTER LIST IN YOUR NAME
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందా లేదా అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.
నిర్ణీత గడువులో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది వివరాలతో ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం మీద 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు సీఈవో సుదర్శన్రెడ్డి వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను పరిశీలించగా.. సుమారు 73 లక్షల మంది ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్) కేటగిరీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు, 32 లక్షల మంది మ్యాపింగ్ కాని ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుమారు 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను, అవసరమైన పత్రాలను సమర్పించి తమ ఓటు వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు గడువు ఉన్నట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. నోటీసులను బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) పోస్టు ద్వారా పంపించనున్నట్లు చెప్పారు.
ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో తమ పేరు లేకపోతే సంబంధిత వ్యక్తులు ఫారం 6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు సూచించారు. అలాగే తమ ఓటును తొలగించే అవకాశం ఉందని భావించిన వారు అభ్యంతరాలను సమర్పించుకోవచ్చు. ఓటర్లకు నోటీసు ఎందుకు జారీ చేశారనే కారణాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో ఆగస్టు 17వ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పనిచేయనున్నట్లు సీఈఓ సుదర్శన్రెడ్డి వెల్లడించారు.
ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా విడుదలైన నేపథ్యంలో ప్రతి ఓటరూ తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. నోటీసు అందిన వారు గడువు ముగిసేలోపు సంబంధిత పత్రాలతో స్పందించాలని పేర్కొన్నారు. తమ పేరు ముసాయిదా జాబితాలో లేకపోతే, లేదా ఓటు తొలగింపుపై అభ్యంతరం ఉంటే నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Social Plugin