ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక తయారైంది. ఇప్పటికే తయారైన పీఆర్సీ నివేదిక సీఎం కేసీఆర్ వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఈనెల 30న కేసీఆర్ ఉద్యోగాల సంఘాలతో భేటి అయి అదేరోజు పీఆర్సీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే పీఆర్సీ నివేదిక తయారీకి ప్రభుత్వం రూ.15కోట్ల వ్యయం చేయడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఏర్పడిన తొలి పీఆర్సీ 2018 మే 18న ఏర్పాటైంది. మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం నాడే ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ పీఆర్సీకి సారథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్.. మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సి.ఉమామహేశ్వరరావు.. మహ్మద్ అలీ రఫత్లను సభ్యులుగా నియమించారు. మూడునెలల్లో సమర్పించిన నివేదిక గడువు పెంచుతూ 31నెలలు చేశారు.
డిసెంబర్ 31న పీఆర్సీ గడువు ముగియనుండటంతో ఇప్పటికే నివేదిక తయారు చేశారు. పీఆర్సీ నివేదికను రూపొందించే సమయంలోనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు.. వనరులు.. రాష్ట్ర ఖజానాపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తొలుత మూడు నెలల కాలానికి గడువు విధించినప్పటికీ దానిని ఇప్పటివరకు మూడుసార్లు పొడగించారు. సిబ్బంది ఖర్చులు.. వగైరా లెక్కలు చూస్తే ఇప్పటివరకు ప్రభుత్వం వేతన సంఘం నివేదిక కోసం రూ.15కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంత భారీ మొత్తం ఖర్చుచేసి తయారు చేసిన పీఆర్సీ నివేదిక రేపోమాపో రానుండటం ఆసక్తిని రేపుతోంది. ముగ్గురు సభ్యులు తయారుచేసిన పీఆర్సీ నివేదిక ఉద్యోగుల్లో ఏమేరకు సంతృప్తిని నింపుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Social Plugin